Share News

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 14 , 2026 | 12:04 AM

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూ పంట ఉత్పత్తులు వినియోగదారులకు నేరుగా విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు.

రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం
గోవర్ధన్‌నగర్‌ రైతు బజార్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, జేసీ, ఎమ్మెల్యే

కల్లూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రైతు బజార్లలో అన్నదాతలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తూ పంట ఉత్పత్తులు వినియోగదారులకు నేరుగా విక్రయించుకునేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు. గురువారం కల్లూరు అర్బన్‌ గోవర్ధన్‌నగర్‌లో రూ.54.52 లక్షలతో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 5 రైతు బజార్లు పని చేస్తున్నాయని, మరో 4 రైతు బజార్ల ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించామని తెలిపారు. గోవర్ధన్‌నగర్‌ రైతుబజార్లో 34 స్టాళ్లను ఏర్పాటు చేశామని, 34 మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు అమ్ముకోవచ్చని తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బజార్లలో దళారుల ప్రమేయాన్ని అరికట్టి రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రైతులు నేరుగా పంటలను విక్రయించుకునేలా రైతుబజార్‌ ఏర్పాటు చేవామని జేసీ తెలిపారు. మార్కెట్‌ యార్డ్‌ ఏడీఏ నారాయణమూర్తి, మార్కెట్‌యార్డ్‌ అధికారి రాఘురాంరెడ్డి, సెక్రటరీ జయలక్ష్మి, నంద్యాల ఏడీ రెహమాన్‌, పాణ్యం సెక్రటరీ రెహమాన్‌, తహసీల్దారు కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 12:04 AM