బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:59 PM
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు.
బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ శాఖలు సమ న్వయంతో పని చేయాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బాలల హక్కుల పరిరక్షణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల సంక్షేమ కార్యక్రమా లపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ 0-18 సంవత్సరాల వయస్సు గల బాలబాలికల హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పని చేస్తుందన్నారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యమని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తే చైల్డ్ బెగ్గింగ్ను సమర్దవంతంగా అరికట్టవచ్చ న్నారు. కమిషన్ సభ్యులు శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్లా మధుసూదన్రావు మాట్లాడుతూ విద్యార్థుల రవాణా భద్రత దృష్ట్యా పాఠశాలల బస్సుల ఫిట్నెస్ను నిరంతరం తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించే వాహనా లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్పీరా, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, పోలీసు మహిళా సంక్షేమం, విద్యా, వైద్య, ఆరోగ్య కార్మిక, గ్రామాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు.