ఓటు హక్కు అత్యంత కీలకం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:04 AM
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు.
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన వీడియో సందేశాన్ని విన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం మొత్తం 20.81 లక్షల ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 10.24 లక్షల మంది, మహిళా ఓటర్లు 10.56లక్షల మంది, సర్వీస్ ఓటర్లు 1,600 మంది ఉన్నారని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని పేర్కొన్నారు. ఓటర్లతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. జిల్లాలో నిర్వహించిన వివిద పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. నూతన యువ ఓటర్లు, సీనియర్ ఓటర్లను శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, కార్యాలయ పరిపాలన అధికారి శివరాముడు పాల్గొన్నారు.
నేడు పీజీఆర్ఎస్ రద్దు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు.