స్వచ్ఛ నంద్యాల లక్ష్యం
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:30 PM
నంద్యాలను చెత్త రహిత జిల్లాగా చేసి స్వచ్ఛ నంద్యాల లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల టౌన్, జూన్ 6(ఆంధ్రజ్యోతి): నంద్యాలను చెత్త రహిత జిల్లాగా చేసి స్వచ్ఛ నంద్యాల లక్ష్యమని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ నిర్వహించారు. సాయిబాబా నగర్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించి నివాస, వాణిజ్య ప్రాంతాల్లో భారీ వ్యర్థాల ఉత్పత్తి దారులు, ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దుకాణాదారులు పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి శనివారం ఒక టీంతో ఒక్కో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఎస్ఎస్ మురళి, డీఈ నాగభూషణం రెడ్డి మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.