ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:33 PM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఐదు నెలల్లో 18,529 ‘ట్రాఫిక్’ కేసులు
కర్నూలు క్రైం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాపిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కర్నూలులోని తన కార్యాలయం నుంచి ఎస్పీ పలు సూచనలు చేశారు. వాహనాదారులు, రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. అలాగే మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 18,529 కేసుల్లో ఈ-చలానాలు నమోదు చేసినట్లు తెలిపారు. ఓవర్ స్పీడ్ చేసిన 3.732 మంది వాహనదారులకు జరిమానాలు, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో 3,803 కేసులు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 2,914 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే సెల్ఫోన్ డ్రైవింగ్ చేసిన 836 మందిపై ఈ-చలానా జరిమానాలు, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలో 7,244 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.