నగర సమగ్ర ప్రగతే లక్ష్యం
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:48 PM
నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సూచించారు.
అభివృద్ధి పనుల సమీక్షలో మంత్రి టీజీ భరత్
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నగర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో కమిషనర్ పి.విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లతో వార్డుల వారీగా అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ నిర్దేశిత గడువు లోపు పనులు పూర్తిచేయాలని, అవసరమైన చోట సమన్వయంతో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెంచిన ట్రేడ్ లైసెన్సు రుసుములను పాత రుసుముల మేరకే వసూలు చేయాలన్నారు. మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిలను రాబట్టాలని సూచించారు. వీధి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు సంతాన నియంత్రణ కేంద్రంలో రోజువారి చికిత్స సామర్థ్యాన్ని 100 శునకాలను పెంచాలని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ సతీ్షకుమార్ రెడ్డి, ఎస్ఈ విష్ణుమూర్తి, డీసీపీ వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డా.నాగప్రసాద్ బాబు, కార్యదర్శి నాగరాజు, ఆర్వో లు జునైద్, వాజీద్, స్వర్ణలత, పట్టణ ప్రణాళికాధికారి అంజాద్ బాషా, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, డీఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.