అన్న ప్రసాదం!
ABN , Publish Date - Apr 20 , 2026 | 11:58 PM
నిరాశ్రయులు, నిరుపేదలకు మూడు పూటలా నాణ్యమైనా ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘అన్న క్యాంటీన్లు’ పేదల పాలిట వరప్రసాదంగా మారుతున్నాయి.
పేదల కడుపు నింపే ‘అన్న క్యాంటీన్’
పేదల మధ్య చంద్రబాబు బర్త్డే వేడుకలు
అన్న క్యాంటీన్ల వద్ద పెరిగిన రద్దీ
నంద్యాల, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): నిరాశ్రయులు, నిరుపేదలకు మూడు పూటలా నాణ్యమైనా ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘అన్న క్యాంటీన్లు’ పేదల పాలిట వరప్రసాదంగా మారుతున్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యామ్నం, రాత్రి భోజనం రూ.5కే అందిస్తుండటంతో పేదలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. నిరుపేదలు, ఆపన్నులు వెళ్లి నామమాత్రపు ఖర్చుతో నాణ్యమైన ఆహారాన్ని సంతృప్తిగా ఆరగిస్తున్నారు. పేదల ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లోనే ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడంతో కూలీలు, నిరుపేదలు ఎలాంటి ఆధారం లేని వారు తరలివస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రి ఎదురుగా, బస్టాండ్ ఎదురుగా రెండు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో నిత్యం ఒక్కో దానిలో రోజుకు 1,500 మంది పేదలు అకలి తీర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ అన్న క్యాంటీన్లలోనే సోమవారం సీఎం చంద్రబాబు నాయుడి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లలో ఉచితంగా పేదలకు భోజనం అందజేశారు. ఎక్కడిక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర కీలక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున అన్నక్యాంటీన్లకు చేరుకుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
నంద్యాలలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ 76 కేజీలతో తయారు చేసిన కేక్ కటింగ్ చేసి అనంతరం ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్, పండ్లు, పాలు పంపిణీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లను పరిశీలించి పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్థన్రెడ్డి నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసి ఏరియా ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. డోన్, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గిత్తా జయసూర్య, భూమా అఖిలప్రియ చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అన్నక్యాంటీన్లకు వెళ్లారు. అక్కడ పేదలకు భోజనం వడ్డించి అభిప్రాయాలను తీసుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత గడివేముల మండలం బిలకల గూడురు గ్రామంలో కేక్ కటింగ్ చేశారు.
పేదల ఆకలి తీర్చడం గొప్ప సంకల్పం
పేదల ఆకలి తీర్చడం కోసం సీఎం చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడం గొప్ప సంకల్పం. ఇంతటి గొప్ప అవకాశం సీఎం చంద్రబాబుకు దక్కడం అదృష్టం. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి సీఎం చంద్రబాబు.
- న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
పేదల ఆకలి తీర్చడం గొప్ప సంకల్పం
పేదల ఆకలి తీర్చడం కోసం సీఎం చంద్రబాబునాయుడు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారు. పేదల ఆకలి తీర్చడం గొప్ప సంకల్పం. ఇంతటి గొప్ప అవకాశం సీఎం చంద్రబాబుకు దక్కడం అదృష్టం. ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి సీఎం చంద్రబాబు.
- న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు
ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించే విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు. జగన్ హయాంలో అనాథగా మారిన ఏపీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం తిరిగి గాడిలో పెట్టారు. అన్న క్యాంటీన్లు పేదలకు నిజంగానే కడుపు నింపే ఆలయాలు. ఈ పథకం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్రెడ్డి
పేదల పాలిట మహనీయుడు
పేదలకు మూడు పూటలా అన్న క్యాంటీన్ల వద్ద భోజనం పెడుతున్న మహానీయుడు సీఎం చంద్రబాబునాయుడు. తల్లిదండ్రులకు పట్టెడు భోజనం పెట్టలేని కొడుకులు ఉన్న ఈ సమాజంలో అతి తక్కువ ధరకు రూ.5కే కడుపు నిండా భోజనం పెట్టి పేదల ఆకలి తీర్చడం ఎంతో ఆనందంగా ఉంది. పేదలందరూ సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో నాలాంటి పేదలు భోజనం కోసం అల్లాడిపోయారు.
- గైబూసా, ఆళ్లగడ్డ
అన్న క్యాంటీన్ ఆదుకుంటోంది
కుటుంబంలోని వారు నాకు దూరమయ్యారు. ఇంటింటికి పేపర్లు పంచుతూ వాటి ద్వారా వచ్చిన కమిషన్తో నన్ను నేను పోషించుకుంటున్నాను. హోటళ్లలో ఎక్కువ ధరకు భోజనాన్ని తినలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో అన్న క్యాంటీన్లు ఆదుకుంటున్నాయి. రూ.5కే కడుపునిండా అన్నం తింటూ సంతృప్తిగా జీవిస్తున్నాను. ఇవాళ ఉచితంగానే భోజనం అందజేశారు.
- దస్తగిరి, నంద్యాల
రోగుల సహాయకులకు ఆసరాగా
నాది రుద్రవరం మండలం యర్రగుడిదిన్నె. అనారోగ్య సమస్యల కారణంగా పలుమార్లు వైద్యం నిమిత్తం నంద్యాలకు వస్తుంటాను. వైద్యానికే డబ్బులు సరిపోవు. అలాంటి పరిస్థితిలో హోటల్కు వెళ్లి తినే ఖర్చును మిగుల్చుకోవడానికి ప్రయత్నించేదాన్ని. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్నక్యాంటీన్లో తక్కువ ధరకే రుచికరమైన భోజనాన్ని ఆరగిస్తున్నాను. ఈ పథకం ఏర్పరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు పదికాలాల పాటు చల్లగా ఉండాలి.
- లక్ష్మీనరసమ్మ