ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:07 AM
కోర్టు పనులతో ప్రతిరోజు ఒత్తిడికి గురయ్యే న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు.
కర్నూలు లీగల్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కోర్టు పనులతో ప్రతిరోజు ఒత్తిడికి గురయ్యే న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక న్యాయసేవా సదన్ భవన్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారని అయితే.. వాటిని ఒక ప్రణాళిక ప్రకారం సరిదిద్దుకుని పనులు పూర్తి చేసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని తెలిపారు. ఈ వైద్యశిబిరాల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా 400 మందికి ఉచితంగా టుడీ ఏకో, ఈసీజీ, షుగర్, బీపీ సంపూర్ణ వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో కామేశ్వర ప్రసాద్, కర్నూలు మెడికవర్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంటు డా.వై. మహేశ్వరరెడ్డి, డా. ముసాహిద్ చౌదరి, డా.కే. శ్రీసాత్విక, డా.సరయురెడ్డి, ఈఎన్టీ డాక్టర్ శశికిరణ్, డా. మంజునాథ్, డా.ఎ్స.లక్ష్మి పాల్గొన్నారు.