తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:57 AM
రానున్న వేసవి కాలంలో నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు
జల వనరుల అధికారులతో సమన్వయం చేసుకోండి
నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రానున్న వేసవి కాలంలో నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం అశోక్నగర్లోని నీటి శుద్ది కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. నీటిశుద్ధిప్రక్రియలో ఉపయోగించే ఫెర్రీస్ ఆలమ్, లిక్విడ్ క్లోరిన్ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఎలక్ర్టికల్ మీటర్లు, స్ర్కాబ్ యూనిట్ను పరిశీలించి, భద్రతాపరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాక్ నిల్వ పట్టికలు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి లోపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, లీకేజీ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్.ఎస్.ట్యాంకులో 0.15 టీఎంసీ సుంకేసుల ప్రాజెక్టులో 1.2 టీఎంసీ నీటి నిల్వలపై ఎప్పటికప్పుడు జలవనరుల శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టులో 1 టీఎంసీ నీటి నిల్వ చేసుకునేలా జలవనరుల శాఖ అధికారులతో కలిసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీఈఈ గిరిరాజ్, ఏఈ జనార్దన్, ఇన్చార్జి కేశవ్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.