రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:56 AM
గతంలో నకిలీ విత్తనాలను అంటగట్టిన కావేరీ కంపెనీ యాజమాన్యానికే వైసీపీ పార్టీ నేతలు వత్తాసు పలికారు.
కలెక్టరేట్ వద్ద పత్తి రైతుల ఆందోళన ఫ కలెక్టర్కు మొర
కర్నూలు అగ్రికల్చర్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): గతంలో నకిలీ విత్తనాలను అంటగట్టిన కావేరీ కంపెనీ యాజమాన్యానికే వైసీపీ పార్టీ నేతలు వత్తాసు పలికారు. కనీసం మీరైనా న్యాయం చేస్తారని రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం.. అయినా.. న్యాయం జరగడం లేదు. ఇప్పటికైనా మమల్ని కష్టాల నుంచి గట్టెక్కించండి.. లేకపోతే ఆత్మహత్యలే శరణ్య మంటూ పత్తి రైతులు శనివారం కలెక్టర్ డా.ఏ.సిరికి మొర పెట్టుకున్నారు. వివిధ మండలాల నుంచి 2021లో కావేరి కంపెనీ నుంచి కొనుగోలు చేసిన జాదురకం పత్తి విత్తనాల వల్ల నష్టపోయిన వందలాది మంది రైతులు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పత్తి రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని కావేరి కంపెనీ నుంచి అందించకుంటే కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తామని ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ, ఆంజనేయులు, శివారెడ్డి, పెద్దిరెడ్డి, నాగేష్, కృష్ణారెడ్డి, మాణిక్యంరెడ్డి, వెంకట్రాముడు, భూపనపాడు రాజు, గిడ్డయ్య, వేణుగోపాల్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.