విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ABN , Publish Date - Jul 11 , 2026 | 10:53 PM
విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణ అంకితభావంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ భారతీయ, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు
ఘనంగా ఐఐఐటీడీఎం 8వ వార్షికోత్సవం
కర్నూలు ఎడ్యుకేషన్, జూలై 11(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణ అంకితభావంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రముఖ భారతీయ, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎల్లా వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కర్నూలు ఐఐఐటీడీఎంలో 8వ స్నాతకోత్సవాన్ని డైరెక్టర్, ప్రొ.బీఎస్ మూర్తి, బోర్డు ఆఫ్ గవర్నర్, చైర్మన్ ప్రొ.ఎన్వీ రమణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితకాల అభ్యాసం, వినయం, నైతిక ప్రవర్తన, నిరంతర ఆత్మ విశ్వాసం ప్రాముఖ్యం గురించి వెంకటేశ్వరరావు వివరించారు. పట్టభద్రులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణానికి అర్థవంతంగా తోడ్పడాలని తెలిపారు. నిజమైన విజయం కేవలం వృత్తిపరమైన విజయాలలోనే కాకుండా చిత్తశుద్ది, కరుణతో మానవాళికి సేవ చేయడంలో కూడా ఉందని వ్యాఖ్యానించారు. కర్నూలు ఐఐఐటీడీఎం డైరెక్టర్, ప్రొ.బీఎస్ మూర్తి ఈ ఏడాదిలో సంస్థ సాధించిన అనేక మైలురాళ్ల గురించి వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ అన్మ్యాండ్ ఏరియల్ సిస్టమ్, ఎంటర్ప్రెన్యూనర్షిప్స్ వంటి రంగాల్లో ఇంటర్డిసిప్లీనరీ మైనర్ ప్రోగ్రామ్లను ప్రవేశ పెట్టడం ద్వారా ఐఐఐటీడీఎం కర్నూలు తన విద్యావ్యవస్థను బలోపేతం చేసిందని అన్నారు. 60 శాతం పైగా విద్యార్థులు మైనర్ స్పెషలైజేషన్లను అభ్యసించడానికి ఎంచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో ప్లేస్మెంట్ రేటు 77 శాతంగా నమోదైందని చెప్పారు. అత్యధికంగా అందించిన వార్షిక ప్యాకేజీ రూ.65 లక్షలు కాగా.. సగటు ప్యాకేజీ సంవత్సరానికి రూ.11.68 లక్షలుగా ఉందని చెప్పారు. మైక్రోసాప్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, ఎలైట్, ఐబీఎం, పీపీఎస్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు పలు వర్ధమాన టెక్నాలజీ కంపెనీలలో విద్యార్థులు ఉద్యోగాలు పొందారన్నారు. మెన్ అండ్ ఉమెన్ హాస్టళ్ల విస్తీరణ 500 కిలోవాట్ల సోలార్ రూప్టాప్ పవర్ ప్లాంట్ ప్రారంభం, బహుళ విషయక విద్య ఆవిష్కరణలు, పరిశ్రమల ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించేందుకు సెంటర్ ఫర్ ఇంటర్ డిసిప్లీనరీ ప్రోగ్రామ్స్ ఏర్పాటు వంటి కీలక మౌలిక సదుపాయాలు, అభివృద్ది పనుల గురించి ఆయన వివరించారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 250మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకున్నారు. ప్రదానం చేసిన డిగ్రీల్లో 211 బ్యాచ్లర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), 29 ఎంటెక్, 1 డ్యూయల్ డిగ్రీ, 9 పీహెచ్డీలు ప్రదానం చేశారు. బీటెక్ ప్రోగ్రామ్లలో అత్యధికంగా 9.37 పీజీపీఏ సాధించినందుకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సోహబ్ ఆప్తాబ్ స్వర్ణ బంగారు పతకాన్ని అందుకున్నారు. బ్రాంచ్ వారీగా టాపర్లు సీఎస్ఈలో సోహబ్ ఆప్తాబ్, సాయి భవ్య ఆర్టీఫిసియల్ ఇంటెలెజెన్సి డేటా ఆఫ్ సైన్స్, సీసీఈలో ఎస్.సుస్వహ, మెకానికల్ ఇంజనీరింగ్లో సోహన్ శర్మకు గోల్డ్ మెడల్, పట్టాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రర్ అసోసియేట్ డీన్స్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.