బడివైపు అడుగులు
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:44 PM
వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు.
పున:ప్రారంభమైన పాఠశాలలు
స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
ఉత్సాహంగా వెళ్లిన విద్యార్థులు
కర్నూలు ఎడ్యుకేషన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు. విద్యార్థులు హుషారుగా తరగతి గదుల్లో అడుగు పెట్టారు. వీరికి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దీంతో తొలిరోజు పాఠశాలలు సందడిగా కనిపించాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో హాజరు తక్కువగా కనిపించింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంతో పాటు భోజనంలో విద్యార్థులకు అందించే గుడ్డు, చిక్కి పాఠశాలల పాయింట్కు సరఫరా లేకపోవడంతో పంపిణీ చేయలేదు. స్వీటు, అన్నం, పప్పు, అన్నంతోనే విద్యార్థులు సరి పుచ్చుకున్నారు. అలాగే విద్యార్థి మిత్ర కిట్లు సంబంధించిన బ్యాగ్స్, బెల్టులు, షూస్ కూడా సరఫరా సక్రమంగా జరగలేదు. పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజుల నుంచి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజే పూర్తి సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. తొలిరోజు పూర్తిస్థాయిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్లు పూర్తిస్థాయిలో అందించలేకపోయారు. సోమవారం నుంచి యథావిధిగా విద్యార్థులకు మధ్యాహ్నభోజనంతో పాటు చిక్కీలు, గుడ్డు అందిస్తామని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఏడీ నాగభూషణం తెలిపారు.