ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం
ABN , Publish Date - Sep 03 , 2026 | 12:19 AM
కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం నగర శివారులోని గార్గేయపురం డంప్యార్డులో కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి పరిశీలించి, అక్కడ నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గార్గేయపురం, జొహరాపురం డంప్యార్డులో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ ద్వారా రెమీడియేన్ చేస్తున్నామన్నారు. పాత వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించడంతోపాటు భవిష్యత్తులో చెత్త డంపింగ్ సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించామన్నారు. ఎస్ఈ జే.రమణమూర్తి, ప్రజారోగ్య సాంకేతిక కార్యనిర్వాహక ఇంజనీర్ గుర్రప్ప యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జలయజ్ఞం అంటే.. ధనయజ్ఞం కాదు : పట్టాభి
కర్నూలు అర్బన్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు, త్రాగునీరు, పరిశ్రమలకు నీరందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగీరథయత్నం చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జలయజ్ఞం ధనయజ్ఞంలా సాగిందన్నారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని విడుదల చేయడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. గొడ్డలిపార్టీ నేత వైఎస్ జగన్ ఇప్పటికైనా ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సొమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్పొరేషన్ల డైరెక్టర్లు జేమ్స్, పర్వీన్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.