తర'గతి తప్పిన నిర్మాణాలు'
ABN , Publish Date - May 28 , 2026 | 12:25 AM
గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద పాఠశాల అదనపు తరగతి గదుల పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేయడతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
నిధులు లేక ఆగిపోయిన గదుల నిర్మాణ పనులు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
చాగలమర్రి, మే 27 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద పాఠశాల అదనపు తరగతి గదుల పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేయడతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 20 పాఠశాలలకు రెండో విడత నాడు-నేడు కింద రూ.9.49 కోట్లు నిధులు మంజూరయ్యాయి. పాఠశాలల హెచ్ఎంలు, కమిటీలు కలిసి పనులు ప్రారంభించి, పిల్లర్ల వరకు పనులు చేసి వదిలేశారు. ముత్యాలపాడులో మూడు అదనపు గదులకు రూ.11.61 లక్షలు, గొడిగనూరులో మూడు భవనాలకు రూ.14.74 లక్షలు, మద్దూరులో మూడు భవనాలకు రూ.53 లక్షలు, బాలుర ఉన్నత పాఠశాలలో 4 భవనాలకు రూ.36.45 లక్షలు, బాలికోన్నత పాఠశాలకు 4 భవనాలకు రూ.49.88 లక్షలు, చిన్న వంగలి ఉన్నత పాఠశాలకు నాలుగు భవనాలకు రూ.30.20 లక్షలు ఖర్చు చేశారు. మంజూరైన నిధుల వరకు పనులు చేశామని, పూర్తి నిధులు విడుదల కాకపోవడంతో పనులు ఆగిపోయాయయని హెచ్ఎంలు అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం నాడు-నేడును తొలగించి మనబడి-మన భవిష్యత్తుగా మార్చింది. ఈ పథకంతోనైన భవన పనులు పూర్తి చేసి పాఠశాలల్లో విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు కోరుతున్నారు.