Share News

సంక్రాంతి సంబరాలు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:51 PM

తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన వేడుక సంక్రాంతిని మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాల్లో సంక్రాంతి ఉత్సవాల శోభ కనిపించింది.

సంక్రాంతి సంబరాలు
భోగి మంటల సందడి...చిన్నారులకు రేగు పండ్లు పోసే కార్యక్రమంలో తల్లిదండ్రులు

సంప్రదాయబద్ధంగా భోగి మంటలు

ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు

ఆలయాల్లో పూజలు

కర్నూలు కల్చరల్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన వేడుక సంక్రాంతిని మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయాల్లో సంక్రాంతి ఉత్సవాల శోభ కనిపించింది. సంక్రాంతి వేడుకల్లో వరుసగా భోగి, సంక్రాంతి పండుగలను బుధవారం, గురువారం నిర్వహించుకోగా, శుక్రవారం కనుమ పండుగను గ్రామసీమల్లో రైతు కుటుంబాలు ఘనంగా నిర్వహించుకున్నాయి. పాతనగరం దక్షిణ షిరిడీగా వినతికెక్కిన సాయిబాబా దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండువ చేశాయి. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గంగిరెద్దు ఆటగాళ్ల విన్యాసాలు, చిన్న పిల్లలకు భోగి పండ్ల ఉత్సవం, భోగి మంటలు, బాబా, హరిదాసుల వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి సద్ద రొట్టెలు, కలగూర పాయసం చేయించి స్వామివారి నైవేద్యంగా భక్తులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దేవస్థానం కార్యదర్శి ఎస్‌జీ మహాబలేష్‌ తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

ముగ్గుల పోటీలు: నగర శివారు కాలనీలోని జోహరాపురం ఇందిరమ్మ కాలనీలో(నట్టు)లో శుక్రవారం సాయంత్రం మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు, ఆటో రివర్స్‌ పోటీలు, కుర్చీల ఆటలు, తాడు లాగుడు పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథులు నగర సీఐటీయూ నాయకులు మహబూబ్‌ బాషా, రామాంజనేయులు అలియాస్‌ విజయ్‌, రిటైర్డు డీఎస్పీ కోడలు అనితారెడ్డి పాల్గొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్ణేతలుగా అనితారెడ్డి పాల్గొని ముగ్గులను పరిశీలించి విజేతలను ప్రకటించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భరత్‌ కుమార్‌, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

దేవనగర్‌లో సంక్రాంతి కోలాహలం

25వ వార్డు దేవనగర్‌లో శుక్రవారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. దేవనగర్‌ యూత్‌ ఓసీఎం రంగా ఆధ్వర్యంలో జరిగిన చిన్నారుల డాన్స్‌ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కాలనీలో ముగ్గుల పోటీలతో పాటు లక్కీడ్రాలో ఎంపికైన వారికి బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీల విజేతలకు నగదు ప్రోత్సాహకాలతో పాటు లక్కీడ్రాలో గెలుపొందిన వారికి సెల్‌ఫోన్లు, మిక్సీలు తదితర వస్తువులను అందజేశారు. కుమ్మర శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు నాగన్న, టీజీవీ కళాక్షేత్రం సభ్యుడు కె.వి.రమణ, మనోహర్‌ రావు, సుధాకర్‌ గౌడ్‌, ఈశ్వర్‌, మురళీ మోహన్‌, మల్లికార్జున, రవి, సురేష్‌, చంద్రశేఖర్‌, బాబు, రాఘవేంద్ర, తారకేష్‌ పాల్గొన్నారు.

ఓర్వకల్లు: మండలంలోని కేతవరం గ్రామంలో సంక్రాంతి సందర్బంగా సీపీఎం, ప్రజా సంఘాల ఆద్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్యామలమ్మ, నాగన్న విజేతలకు ప్రదానం చేశారు. శ్రీధర్‌, సుధాకర్‌, మధు ఉన్నారు.

సి.బెళగల్‌: మండల కేంద్రంలో టీడీపీ నాయకులు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చారు. గోపాల్‌గౌడ్‌ భ్రదర్స్‌, మాజీ ఎంపీటీసీ దనుంజయుడు, వినోద్‌కుమార్‌, మీసేవా రామకృష్ణ, చికెన్‌ ఈరన్న, భీమన్న, వెంకటేశ్వర్లు ఉపేంద్ర, హోటల్‌ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్లు నిర్వాహకులు ఎంపీటీసీ ఈరన్నగౌడు, మీసేవా మల్లికార్జునగౌడు తెలిపారు.

కోడుమూరు రూరల్‌: మండలంలోని సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ ఇళ్ల వద్ద ముంగిళ్లను రంగవల్లులతో నింపారు. అనంతరం పిండి వంటలు చేసుకుని, ఇంటిల్లిపాది కలిసి భోజనం చేశారు. కనుమ రోజు పశువులకు పూజలు చేశారు. గోరంట్ల లక్ష్మీమాధవస్వామి ఆలయంలో గోదా మాధవస్వామికి పూజలు చేసి, హంద్రీనదిలో చక్రస్నానం అనంతరం గ్రామోత్సవం చేపట్టారు.

Updated Date - Jan 16 , 2026 | 11:51 PM