Share News

ఆదోని మెడికల్‌ కాలేజీకి మోక్షం

ABN , Publish Date - May 02 , 2026 | 10:35 PM

రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) - పీపీపీ విధానంలో నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబరు 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీల క నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆదోని మెడికల్‌ కాలేజీకి మోక్షం

పీపీపీ విధానంలో నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం

తొలి జాబితాలో ఆదోని కళాశాలకు స్థానం

రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) - పీపీపీ విధానంలో నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబరు 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీల క నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వైద్యకళాశాల సమీక్షలో తొలి దశలో ఐదు కాలేజీల నిర్మించేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందులో ఆదోని కాలేజీ కూడా ఉంది. త్వరలోనే ఆగిపోయిన నిర్మాణాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఏపీ వైద్యారోగ్య శాఖాధికారులు అంటున్నారు. అదే జరిగితే పశ్చిమ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలతో పాటు మెడిసిన్‌ చదవాలనుకునే విద్యార్థుల భవితకు మార్గం సుగమనం కానుంది.

-కర్నూలు, మే 2(ఆంధ్రజ్యోతి)

420 బెడ్స్‌ బోధనాస్పత్రి..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆదోని మం డలం ఆరేకల్లు గ్రామం దగ్గర 59.50 ఎకరాల విస్తీర్ణంలో 420 బెడ్స్‌ బోధనాస్పత్రి నిర్మించాలని లక్ష్యం. రూ.475 కోట్లు నాబార్డు రుణంతో పనులు మొదలు పెట్టారు. 2024-25 సంవత్సరం నుంచి వైద్య విద్యా తరగతులు ప్రారంభిస్తాం అంటూ నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఆర్భాటం చేశారు. 13.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్‌ హాస్పిటల్‌, మెడికల్‌ కాలేజీ, రెసిడెన్షియల్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌, నర్సింగ్‌ కాలేజీ, విద్యార్థుల వసతి గృహా లు, జూనియర్‌, సీనియర్‌ రెసిడెన్స్‌ హాస్టల్‌, వర్కింగ్‌ స్టాఫ్‌ నర్స్‌ క్వార్టర్స్‌, హాస్టల్‌, సెంట్రల్‌ కిచెన్‌, డైనింగ్‌, ఎంజీపీఎస్‌ ప్లాంట్‌ రూమ్స్‌, లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌తో నాటె వివిధ భవన నిర్మాణాలు రూ.350 కోట్లతో చేపట్టారు. ఏపీ మెడికల్‌ సర్వీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షణలో చేపట్టిన పనులు విజయవాడకు చెందిన కేఎంవీ గ్రూప్‌ అనే కాంట్రాక్ట్‌ సంస్థ టెండరు దక్కించుకొని నిర్మాణాలు ప్రారంభించింది.

బిల్లులు రావని చేతులెత్తేసిన..

రూ.370 కోట్లతో వివిధ భవనాలు నిర్మించేందుకు కేఎంవీ గ్రూప్‌ సంస్థ 2022 డిసెంబరు 26న ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్లతో ఒప్పందం చేసుకుంది. రూ.71కోట్లు విలువైన పనులు చేసిన ఆసంస్థ రూ.24 కోట్లు బిల్లులు రాలేదని అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పను లు ఆపేసింది. 20శాతం కూడా పనులు జరగలేదు. ఎక్కడికక్కడే పనులు ఆపేయడంతో ముళ్లపొదలతో నిండిపోయింది.

ప్రత్యేక బృందంతో అధ్యయనం

పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్‌, యూపీ రాష్ర్టాల్లో ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయించింది. కళాశాలను ప్రారంభించాక ఓపీ, రోగ నిర్ధారణ పరీక్షల యం త్రాలు, పరికరాల కొనుగోళ్లకు అయ్యే వ్యయం, వైద్యసీట్లు ద్వారా వచ్చే ఆదాయం, తదితర వాటిపై సమగ్ర వివరాలతో ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ నిర్వహించేందకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో పనులు పునఃప్రారంభం:

పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీల నిర్వహణ కోసం ఆ రంగంలో అనుభవం కలిగిన సంస్థలను సంస్థలను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. టెండర్లలో ఎంపికైన సంస్థకు ఆదోని మెడికల్‌ కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు.

Updated Date - May 02 , 2026 | 10:35 PM