Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - May 06 , 2026 | 11:49 PM

జిల్లాలోని మూరుమూల గ్రామాలకు రవాణా సౌకార్యాన్ని మెరుగుపరచటంతో పాటు, గ్రామీణ రహదారుల అనుసంధానం, అవసరమైన చోట మరమ్మతులు, మరి కొన్నిచోట్ల నూతన రహదారుల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి.

గ్రామీణ రోడ్లకు మహర్దశ
జోహరపురం అంబేడ్కర్‌ కూడలి నుంచి వెంకాయపల్లె వెళ్లే రహదారి

జిల్లావ్యాప్తంగా 26పనులతో 110.9 కి.మీల రహదారుల నిర్మాణం

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మూరుమూల గ్రామాలకు రవాణా సౌకార్యాన్ని మెరుగుపరచటంతో పాటు, గ్రామీణ రహదారుల అనుసంధానం, అవసరమైన చోట మరమ్మతులు, మరి కొన్నిచోట్ల నూతన రహదారుల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా అత్యంత అవశ్యకత ఉన్న రహదారి పనుల గుర్తించి, వాటి ప్రతిపాదనలు పంపగా అందుకు సంబంఽధించి ఏపీ గ్రామీణ రహదారుల బలోపేతం (ఏపీఆర్‌ఆర్‌ఎ్‌సపీ) పథకం కింద నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈనిధులతో జిల్లాలోని గ్రామీణ రహదారుల ముఖచిత్రం మారనున్నట్లు తెలుస్తోంది.

ప్రతిపాదనలు సిద్ధం

స్థానిక ప్రజల ఇబ్బందులు, ప్రజాప్రతినిధుల సిఫారసులు, పల్లె పండుగ కార్యక్రమంలో అందిన వినతులకు ప్రాధాన్యత కల్పిస్తూ పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రాధాన్యత క్రమంలో పనుల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 26 పనులకు ఆమోదం లభించటంతో పాటు, 110.9 కిలో మీటర్ల రహదారి పనుల నిర్మాణానికి ఏపీఆర్‌ఆర్‌ఎ్‌సపీ కింద రూ.60.09 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో అత్యఽధిక శాతం నూతన రహదారుల నిర్మాణానికే చోటు లభించింది.

నియోజకవర్గాల వారీగా

ఆదోని నియోజకవర్గంలో 6 పనులకు మోక్షం లభించగా, దాదాపు రూ.8.5 కోట్ల నిధుల వెచ్చింపుతో 14 కి.మీ. మేర రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. కోడుమూరు నియోజకవర్గ పరిఽధిలో 5 పనులకు గాను రూ.10.5కోట్లతో 18 కి.మీల రహదారి నిర్మించనున్నారు. ఆలూరు నియోజకవర్గంలో 4 పనులకు రూ.8.5 కోట్లతో 19.3 కి.మీ.లు పనులు, మంత్రాలయం నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ.9.50కోట్లతో నిధులతో 16.5 కి.మీ.లు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లులో రూ.2.8 కోట్లతో 7 కి.మీ.ల మేర రహదారి ఏర్పాటు చేయనున్నారు. పత్తికొండ పరిధిలోని తుగ్గలి, క్రిష్ణగిరి ప్రాంతాల్లో రూ.9.50 కోట్లతో 17.6 కి.మీ.లు, ఎమ్మిగనూరు పరిధిలోని గోనెగండ్లలో రూ.9కోట్లతో 16.6 కి.మీల రహదారి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. నిధుల లభ్యత పుష్కలంగా ఉండి, పనులు టెండరు దశకి చేరుకోవటంతో త్వరలోనే ఇవి కార్యరూపం దాల్చి గ్రామీణ రహదారులు నూతన శోభ సంతరించుకోన్నాయి.

త్వరలోనే పనులు ప్రారంభం

గ్రామీణ రహదారుల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పూర్తికాగానే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం అవుతాయి. ఈనిధుల ద్వారా గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో కి.మీ.ల రహదారులకు మోక్షం లభిస్తోంది.

-ప్రభాకర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ పర్యవేక్షక ఇంజనీరు, కర్నూలు

Updated Date - May 06 , 2026 | 11:49 PM