అర్జీలను సకాలంలో పరిష్కరించండి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:05 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ఈకార్యక్రమంలో అధికారులతో కలిసి కలెక్టర్ వినతులను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి తీసుకున్న చర్యలను స్పష్టంగా తెలపాలన్నారు. నిర్దేశిత గడువు లోగా నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని అన్నారు. అధికారుల లాగిన్లో ఇంకా పరిశీలించని దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.. పీజీఆర్ఎస్ ద్వారా 307 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 167 దరఖాస్తులను స్వీకరించినట్లు వివరించారు.
కలెక్టర్ను కలిసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్
జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ దండే వెంకటనరేశ్ బాధ్యతలు స్వీకరించాక కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సీడబ్ల్యూసీ పనితీరు, పిల్లల సంరక్షణ, రక్షణ, పునరావాసం, విద్య, భద్రత తదితర అంశాలపై చర్చించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన బాధ్యతలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన కలెక్టర్కు తెలిపారు.