ప్రోత్సాహంతోనే ఉన్నత స్థాయికి..
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:30 PM
ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తేనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని రాష్ట్ర న్యాయ, మైనారీటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు.
మంత్రి ఫరూక్
నంద్యాల రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తేనే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని రాష్ట్ర న్యాయ, మైనారీటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. సోమవారం నంద్యాల పట్టణం చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాలులో 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్సు-2026 జిల్లా స్థాయి ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిభకు ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా ఉండదని, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థిని ప్రభుత్వం సమానంగా గౌరవిస్తోందనన్నారు. విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల మౌలిక సదుపాయాల బలోపేతం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయులకు ఆధునిక శిక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఎంపికైన పదో తరగతిలో 183 మంది, ఇంటర్మీడియట్లో 44 మంది సహా మొత్తం 227 మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం, గోల్డ్ మెడల్లను అందజేసి ఘనంగా సత్కరించారు.