శరవేగంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:35 PM
ఈనెల 6వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శరవేగంగా సాగుతున్నాయి.
సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు
ఎమ్మిగనూరు/ ఎమ్మిగనూరు రూరల్, ,ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఈనెల 6వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శరవేగంగా సాగుతున్నాయి. సీఎం పాల్గొనే సభాస్థలి, హెలిప్యాడ్, ఎల్1, ఎల్2 గ్యాలరీలు, వీఐపీ పార్కింగ్, సీఎం పరిశీలించే పొలంతో పాటు ఇతర పనులు మమ్మురంగా చేపడుతున్నారు. బుధవారం కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్తో పాటు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ పర్యవేక్షించారు. అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్లో భాగంగా సీఎం పర్యటన ప్రదేశాలను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ సీఎం రాక సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జేసీ నూరుల్ ఖమర్, ఆర్ అండ్బీ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, ఆదోని ఇన్చార్జీ ఆర్డీవో అజయ్ కుమార్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్, డీపీవో భాస్కర్ పాల్గొన్నారు.