బాలలు, మహిళల రక్షణ అందరి కర్తవ్యం
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:02 AM
బాలలు, మహిళల రక్షణ అందరి బాధ్యత అని అధికారులు పిలుపునిచ్చారు.
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
అవగాహన కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేసిన అధికారులు
నంద్యాల క్రైం, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : బాలలు, మహిళల రక్షణ అందరి బాధ్యత అని అధికారులు పిలుపునిచ్చారు. నంద్యాలలోని మున్సిపల్ హాల్లో నిర్వహించిన మానవ అక్రమ రవాణా నిరోధక అవగాహన కార్యక్రమంలో అధికారులు, న్యాయవాదులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని మానవ అక్రమ రవాణా వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్ధ, కర్నూలు కార్యదర్శి కమ్ సీనియర్ సివిల్ న్యాయాధికారి లీలా వెంకట శేషాద్రి, నంద్యాల జిల్లా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఏ సులోచన, నంద్యాల జిల్లా బాలల పరిరక్షణ అధికారి స్వప్ప పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఒక తీవ్రమైన నేరమని, ఇది మానవ హక్కులకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. పిల్లలు, మహిళలు, ఇతర బలహీన వర్గాలను అక్రమ రవాణా, దోపిడి, బలవంతపు శ్రమ, లైంగిక దోపిడి వంటి నేరాల నుండి రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సంస్ధ, మహిళా పోలీస్, బాలల పరిరక్షణ శాఖల ప్రతినిధులు, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.