రాజకీయ సమీకరణలు తారుమారు
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:16 AM
కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పర్యటన ఒక్కసారిగా రాజకీయ సమీకరణలను తారుమారు చేసింది.
గ్రూపు రాజకీయాలపై ఉక్కుపాదం
మానవత్వం చాటిన నారా లోకేశ్
ఆదోని, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పర్యటన ఒక్కసారిగా రాజకీయ సమీకరణలను తారుమారు చేసింది. గ్రూపు రాజకీయాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. మరోవైపు సామాన్యుల కష్టాలకు స్వయంగా స్పందించి మానవత్వం చాటుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్కంఠ భరితంగా ఆయన పర్యటన కొనసాగింది.
ముఖ్య నేతలతో భేటీ
మంత్రి నారా లోకేశ్ గురువారం ఉదయం స్థానిక టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆదోని ఇన్చార్జి మీనాక్షినాయుడు, సీనియర్ నేత ఉమాపతినాయుడు, యువనేత సిద్ధార్థనాయుడుతో జరిగిన సమావేశంలో ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు. పార్టీలో వర్గపోరు నడిపితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ది లేదని తేల్చి చెప్పారు. రాబోయే మూడేళ్లపాటు నియోజకవర్గ ఇన్చార్జిగా మీనాక్షినాయుడే కొనసాగుతారని స్పష్టం చేస్తూ అపోహలకు తెర దించారు. పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే, మీడియాకెక్కి పార్టీ పరువు బజారుకీడ్చితే సహించేది లేదని హెచ్చరించారు. సమస్యలు ఏవైనా ఉంటే ఇన్చార్జితో మాట్లాడి నాలుగు గోడల నడుమ కూర్చొని సమస్యను పరిష్కరింకోవాలని సూచించారు.
అమ్మా దెబ్బ ఏమైనా తగిలిందా?
మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. అప్పుడు తోపులాట జరిగింది. ఓ వృద్ధ మహిళ ఆకస్మాత్తుగా కింద పడిపో యారు. చుట్టూ భద్రతా సిబ్బంది, హడావుడి వాతావరణం ఉన్నప్పటికీ దీన్ని గమనించిన లోకేశ్ వెంటనే కాన్వాయ్ను ఆపేశారు. కారు దిగి ఆమె వద్దకు వెళ్లారు. ‘అమ్మా ఏమైనా దెబ్బ తగిలిందా? ఆస్పత్రికి వెళ్దామా? అంటూ ఆప్యాయంగా పలకరిం చారు. ఆమె తనకు ఏమీ కాలేదని ధైర్యం చెప్పినప్పటికీ ఆమె యోగక్షేమాలు స్వయంగా తెలుసుకున్నారు.
సంక్షేమ, అభివృద్ధి ఫలాలను..
రెండేళ్ల కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. మండల, క్లస్టర్, యూనిట్ స్థాయి ఇన్చార్జిలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు. స్థానిక సమస్యలపై స్పందించిన లోకేశ్ త్వరితగతిన పరిష్కారాలు చూప ుతామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులను కలుపు కోకుండా ఏ అభివృద్ధి పనులు జరిగినా ఉపేక్షించేది లేదని అధికారులకు స్పష్టం చేశారు.
సీఎం దృష్టికి తీసుకెళ్తానని..
ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ జేఏసీ నాయకులు అందించిన వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి నారా లోకేశ్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగి సిన వెంటనే ఈన్యాయమైన డిమాండ్ను సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఉమాపతినాయుడు, బత్తిన కుబేర్నాథ్, సూరం భాస్కర్రెడ్డి, మారుతినాయుడు, సిద్ధర్థనా యుడు, రంగస్వామి నాయుడు, వెంకటేష్చౌదరి, ఉమ్మి సలీం, రంగన్న లోకేశ్కు ఘనంగా వీడ్కోలు పలికారు. లోకేశ్ పర్యటను ఇటు కేడర్లో, అటు ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపింది.