యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:30 AM
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాను మించిన మార్గం లేదని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన వారసత్వమని, శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ సిరి
కర్నూలు నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాను మించిన మార్గం లేదని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన వారసత్వమని, శారీరక, మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక ఏపీఎస్పీ క్యాంప్ మైదానంలో యోగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఏ.సిరితో పాటు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, సెట్కూరు సీఈవో డా.కే. వేణుగోపాల్, డీఎస్డీవో భూపతిరావు, జిల్లా పర్యాటక శాఖాధికారి లక్ష్మీనారాయణ, జడ్పీ సీఈవో రమణారెడ్డి, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ డా. ప్రసాద్, నోడల్ ఆఫీసర్ డా. అమర్నాథ్, రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, విద్యాసంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని యోగాసనాలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామ విధానం మాత్రమే కాదని, మనిషి జీవనశైలిని సక్రమంగా తీర్చిదిద్దే సమగ్ర సాధనమని తెలిపారు. జిల్లాలో 14 రోజులుగా సాగిన యోగా కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య కార్మికులతో థీమాటిక్ యోగా నిర్వహించామని తెలిపారు. రాక్ గార్డెన్స్, కొండారెడ్డి బురుజు వంటి టూరిస్టు స్పాట్లలో 500 మందితో యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు.