భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:44 PM
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ డా. ఏ.సిరి అన్నారు.
పాసు పుస్తకాల పంపిణీలో కలెక్టర్ డాక్టర్ సిరి
కల్లూరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కలెక్టర్ డా. ఏ.సిరి అన్నారు. శనివారం కల్లూరు మండలం పందిపాడు గ్రామ సచివాలయంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పాసు పుస్త కాల ప్రయోజనాలను రైతులకు వివరించారు. పాసు పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేయగానే పొలం, రైతుల వివరాలు వస్తాయన్నారు. ముఖ్యంగా జాయింట్ ఎల్పీఎం లాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. రైతులకు పాత భూహక్కు పత్రాల స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పందిపాడు లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.