ఆలయాభివృద్ధిని అడ్డుకోవడం దుర్మార్గం
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:07 PM
యాగంటి ఆలయాభివృద్ధిని ఓ మాజీ ప్రజా ప్రతినిధి అడ్డుకోవడం దుర్మార్గమని యాగంటి క్షేత్రం అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి అన్నారు.
యాగంటి క్షేత్రం అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి
బనగానపల్లె, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): యాగంటి ఆలయాభివృద్ధిని ఓ మాజీ ప్రజా ప్రతినిధి అడ్డుకోవడం దుర్మార్గమని యాగంటి క్షేత్రం అసిస్టెంట్ కమిషనర్ పాండురంగారెడ్డి అన్నారు. యాగంటి ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వర్రెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పాండురంగారెడ్డి మాట్లాడుతూ యాగంటి క్షేర్తతంలో పలు అభివృద్ధి పనులు చేస్తుంటే చంపుతామని, శంకర మాన్యాలకు పంపుతామంటూ ఆ మాజీ ప్రజాప్రతి నిధి బెదిరిస్తున్నారన్నారు. ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 1986లో రెండెకరాల స్థలం ప్రభుత్వం కేటాయించిందన్నారు. అప్పట్నుంచి ఒక్క నిర్మాణం కూడా జరగలేదన్నారు. ప్రస్తుతం మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సహకారంతో రూ.5.08కోట్లతో నిర్మిస్తున్న వివిధ అభివృద్ది పనులు చేస్తుంటే కోర్టులకు పోయి ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. యాగంటిపై తమ పెత్తనం జారిపోతోందని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆలయ పాలకవర్గ సభ్యులు తిరుమలయ్య, రామశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సొంత స్థలమైనట్లు దానం
గతంలో దేవదాయ శాఖకు బేతంచెర్లకు చెందిన శేషారెడ్డి అనే దాత 54 సెంట్ల స్థలాన్ని యాగంటి క్షేత్రానికి దానంగా ఇచ్చారని పాండురంగారెడ్డి తెలిపారు. ఈస్థలం తన సొంత స్థలమైనట్లు ఆమాజీ ప్రజా ప్రజాప్రతినిధి బ్రాహ్మణ, ఆర్యవైశ్య అన్నదానసత్రాలకు, సత్యమయ్య అనే పూజారికి ధారాదత్తం చేశారని అన్నారు. యాగంటి క్షేత్రంలో వేద పాఠశాలకు 85సెంట్లు ఆప్రజాప్రతినిధి గతంలో రాసిచ్చారన్నారు. ఆస్థలంలో కూడా యాగశాల నిర్మించడానికి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. బ్రాహ్మణ, ఆర్యవైశ్య అన్నదానసత్రాల నిర్వాహకులకు, సత్యమయ్య అనే పూజారికి, వేదపాఠశాలను స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్న ప్రజాప్రతినిధికి నోటీసులు ఇస్తున్నామన్నారు. యాగంటి క్షేత్రంలో రోడ్డు పక్కన దుకాణాలు వేసుకున్న కొందరు వ్యక్తులు భక్తులకు ఇబ్బంది కలిగించేలా దేదదాయ శాఖకు చెందిన స్థలం ఆక్రమించారని, వారికి కూడా నోటీసులు జారీ చేశామన్నారు. దేవాలయ అభివృద్దిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు.