నేటితో ఉపాధిలో ‘మహాత్మాగాంధీ’కి ముగింపు
ABN , Publish Date - May 01 , 2026 | 12:14 AM
మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్జీ పథకం అమలు చేయనున్నందున మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ముగిసిపోనుంది.
కొత్త వీబీజీరామ్జీ పథకం ఆరంభం
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్జీ పథకం అమలు చేయనున్నందున మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ముగిసిపోనుంది. ఈ కొత్త పథకానికి సంబంధించిన విధి విధానాలపై అవగాహన కల్పించేందు కోసం గత నాలుగు రోజులుగా అన్ని రాష్ట్రాల నీటి యాజమాన్య సంస్థ ఉన్నతాధికారులకు హైదరాబాదులోని మానవ వనరుల కేంద్రంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొత్త పథకంలో ఉపాధికి భరోసా
కేంద్ర ప్రభుత్వం పాత పథకానికి ముగింపు పలికి కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీరామ్జీ పథకం కింద చేపట్టనున్న పనులు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలకు ఆర్థికంగా భరోసా ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనిదినాలు కల్పించారు. కొత్త పథకంలో 125 రోజులకు పనిదినాలను పెంచడంతో పాటు పని కల్పించకుంటే పరిహారాన్ని తప్పనిసరిగా అందించాలని నిబంధన పెట్టడంతో ఉపాధికి ఆర్థిక భద్రత కల్పించినట్లయిందని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఈ పథకంలో గతంలో ఉపాధి కూలీలకు పని కల్పించేందుకు చేసే ఖర్చులో 90 శాతం కేంద్రం, పది శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేది. కొత్త పథకంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించే విదంగా నిబంధనలు చేర్చారు. ఇకపై గ్రామాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించి గ్రామ పంచాయతీలకే పూర్తి అధికారాలు ఇవ్వనున్నారు.
నిబంధనలు త్వరలోనే వస్తాయి
కేంద్ర ప్రభుత్వం వీబీజీరామ్జీ పథకాన్ని మే 1 నుంచి అమలు చేయబోతున్నట్లు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో నిబంధనలు ఇంకా మాకు రాలేదు. ఇప్పటికైతే ముఖ్యమైన కొన్ని నిబంధనలు వచ్చాయి. - నరసింహారెడ్డి డ్వామా పీడీ