వరి.. వర్రీ
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:27 AM
ఎన్నడూ లేనిది ఈ ఏడాది ఎల్నినో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మండలంలో ఖరీఫ్ సీజన్కు ఏటా దాదాపు 1,150 ఎకరాల్లో వరి సాగుచేసేవారు. అయితే ఈ ఏడాది సాగు విస్తీర్ణం కేవలం పది ఎకరాలకు తగ్గిపోయింది.
ఎల్నినో ప్రభావంతో తగ్గిన వరి సాగు, ఈ ఏడాది పది ఎకరాల్లోనే..
కొలిమిగుండ్ల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నడూ లేనిది ఈ ఏడాది ఎల్నినో వరి సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మండలంలో ఖరీఫ్ సీజన్కు ఏటా దాదాపు 1,150 ఎకరాల్లో వరి సాగుచేసేవారు. అయితే ఈ ఏడాది సాగు విస్తీర్ణం కేవలం పది ఎకరాలకు తగ్గిపోయింది. దీంతో పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఎటు చూసినా పచ్చటి వరి మడులు కనిపించేవి. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు తగ్గిపోయింది. ఇప్పటికే నారుమళ్లను సిద్ధం చేసుకునే రైతులు కూడా సాగుకు దూరంగా ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటడం, వ్యవసాయ బావుల్లో నీరు ఇంకిపోవడం, చెరువులు, కుంటలు సైతం ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోయారు. రైతులు అక్కడక్కడా పత్తి, మొక్కజొన్న సాగుచేశారు.
ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలి
ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలైన పత్తి, కంది, జొన్న సాగుచేసుకోవాలి. వర్షం కురిస్తేనే పంటలను కాపాడుకునే అవకాశం ఉంది. - శారదా దేవి, ఏవో