ఎల్నినో ప్రభావంతో వర్షాభావం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:15 AM
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విదంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటలు సాధారణ సాగు విస్తీర్ణం 4.20 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటికీ 3.20 లక్షల హెక్టార్లు లో మాత్రమే పంటలు సాగయ్యాయి
ఎండిపోతున్న పంటలు
తగ్గనున్న మార్కెటింగ్ శాఖ ఆదాయం
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విదంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటలు సాధారణ సాగు విస్తీర్ణం 4.20 లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటికీ 3.20 లక్షల హెక్టార్లు లో మాత్రమే పంటలు సాగయ్యాయి. నంద్యాల జిల్లాలో 2.20 లక్షల హెక్టార్లకు గానూ కేవలం 90వేల హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. సాగు చేసిన ఈ పంటల్లో దాదాపు 50 శాతం పంటలు వర్షంలేక ఎండిపోతున్నాయి. ఆగస్టు నెలలో వర్షం గనుక ఇప్పటిలాగే పడకుంటే సాగైన పంటలన్నీ మట్టిపాలు కాక తప్పదని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి మార్కెటింగ్ శాఖకు భారీగా గండి పడనుందని ఆశాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈఆర్థిక సంవత్సరం కర్నూలు మార్కె ట్ కమిటీ నుంచి రూ.9.60 కోట్లు, ఆదోని నుంచి రూ.21 కోట్లు, ఎమ్మిగనూరు నుంచి రూ.9.10 కోట్లు, ఆలూరు నుంచి 1 కోటి, పత్తికొండ నుంచి రూ.1.8 కోట్లు, కోడుమూరు నుంచి రూ.1.95 కోట్లు, మంత్రాలయం నుంచి రూ.1.40 కోట్లు సెస్సు రూపంలో అందాల్సి ఉంది. కర్నూలు జిల్లాలోని 7 మార్కెట్ కమిటీల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం రూ.45.13 కోట్లు సెస్సు రూపంలో రాబట్టాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఆయా మార్కెట్ కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ కమిటీలకు ప్రధానంగా పత్తి, వేరుశనగ, ఉల్లి పంటల అమ్మకాల ద్వారానే లభిస్తుంది. ఈసారి మాత్రం ఈ రెండు పంటలు బాగా దెబ్బతినే పరిస్థితులు నెలకొంటున్నాయి. .
జీరో వ్యాపారాన్ని అరికడుతాం
మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఇచ్చిన లక్ష్యం మేరకు సెస్సును వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈసారి ఈపర్మిట్ విధానం అమలులోకి రావడం వల్ల భారీగా జీరో వ్యాపారం తగ్గుతుందని ఆశిస్తున్నాం. - నారాయణమూర్తి, ఏడీఎం