ఫిర్యాదు చేస్తే.. హత్య చేస్తారా..?
ABN , Publish Date - Aug 11 , 2026 | 12:24 AM
హంద్రీ నది వెంట ఆక్రమణలు, కబ్జాలపై ఫిర్యాదు చేసిన ఇంతియాజ్ను కిరాతకంగా హత్య చేశారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల కూల్చేవేత గురించి ఆర్డీవో, తహసీల్దార్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు
నిందితులకు బెయిల్ ఇప్పించి కాపాడటం సిగ్గు చేటు
అలజడులు రెచ్చగొట్టేందుకే వైసీపీ పథకం..
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): హంద్రీ నది వెంట ఆక్రమణలు, కబ్జాలపై ఫిర్యాదు చేసిన ఇంతియాజ్ను కిరాతకంగా హత్య చేశారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల కూల్చేవేత గురించి ఆర్డీవో, తహసీల్దార్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. హత్య జరిగిన తర్వాత ఇంటిలిజెన్స్ వ్యవహరించిన తీరు బాధ కలిగించిందన్నారు. ఎస్పీకి కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏ-1 లీగల్గా తప్పించుకునేందుకు పక్కా ప్రణాళికను రచించి హత్యచేశారన్న సమాచారం తనవద్ద ఉందని, ఈ విషయంలో ఇంటలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే సీబీఐ, సీఐడీ దర్యాప్తు కోరతానని తెలిపారు. ప్రభుత్వ ఏర్పడ్డాక తన నియోజకవర్గాంలో నేటి వరకు నలుగురు హత్యకు గురయ్యారన్నారు. వైసీపీ నాయకులు ఒక పథకం ప్రఽకారం హత్యలు చేయిస్తున్నారని, దీనికి చమరగీతం పాడతానని హెచ్చరించారు. నిందితులకు వైసీపీకి చెందిన ఓ పెద్దమనిషి బెయిల్ ఇప్పించి వారికి అండగా నిలవడం సిగ్గు చేటన్నారు. హత్యకు గురైన ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారని, అప్పట్లో అతని నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని వైసీపీ వర్గీయులు ఇంతియాజ్ను బెదిరించారని, ఇంటికి వెళ్లి గొడవకు దిగారని తెలిపారు. ఆ తర్వాత ఇంతియాజ్ టీడీపీలో చేరారని, హంద్రీనది వెంట ఉన్న కబ్జాలను బయట పెట్టాడని, అందువల్లే ఆయనను హత్య చేయించారన్నారు. ఇంత జరుగుతోంటే ఇంటలిజెన్ ్స వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.ఇప్పటికైనా పోలీసులు సీరియ్సగా తీసుకోవాలని కోరారు. కర్నూల్లో రాజకీయ కక్షలు, బెదిరింపులు, దాడులు, హత్యలకు తావులేకుండా ప్రజలకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
వైసీపీ ఇక కనుమరుగే..
ప్రజలు గతంలో ఒక అవకాశం ఇచ్చినా నిలబెట్టుకోలేక పోయారని, భవిష్యత్ లో వైసీపీ అనేది ఉండదని మంత్రి అన్నారు. వైసీపీలో ఉన్న నేతలు కాంగ్రెస్, టీడీపీలో చేరాలని సూచించారు. ఈనెల 13న పరామర్శపేరుతో జగన్మోహన్ రెడ్డి అల్లర్లు సృష్టించేందుకు వస్తున్నారని అన్నారు. ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలా రెచ్చగొట్టి., శాంతి భద్రతలకు విఘాతం కలిగించే నాయకులను ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని తెలిపారు.