తప్పిపోయిన పిల్లలను గుర్తించాలి
ABN , Publish Date - May 25 , 2026 | 10:56 PM
తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, మే 25 (ఆంధ్రజ్యోతి): తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారిని సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం నగరంలోని న్యాయ సేవాసదన్ భవన్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లడుతూ తప్పిపోయిన బాలల భద్రతను దృష్టిలో పెట్టుకుని వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తప్పిపోయిన బాలల కుటుంబాలకు భరోసా ఇచ్చి బాలలను గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాది మంది బాలలు వివిధ కారణాల వల్ల కనిపించకుండా పోతున్నారని, అటువంటి పిల్లలు కిడ్నాప్, మానవ అక్రమ రవాణా వంటి మోసాల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. బాలలు ఏ దేశానికి చెందిన వారైనా వారిని సురక్షితంగా వారి కుటుంబానికి అందజే యాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వాలపై ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఐసీడీఎస్ అధికారి జయ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన తదితరులు పాల్గొన్నారు.