మాట నిలబెట్టుకున్న మంత్రి
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:17 AM
పట్టణంలోని ముస్లింలకు షాదీఖానా లేకపోవడంతో శుభకార్యాలు, సమావేశాలకు ఇబ్బంది పడేవారు. వీరి ఇబ్బందులను గమనించి 2019లో నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి షాదీఖానా నిర్మాణానికి రూ.30లక్షలు విరాళం అందించి, పనులు ప్రారంభించారు
షాదీఖానా నిర్మాణానికి రూ.1.30కోట్లు విరాళం ఇచ్చిన మంత్రి బీసీ
పూర్తయిన పనులు, హర్షం వ్యక్తంచేస్తున్న ముస్లింలు
బనగానపల్లె, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ముస్లింలకు షాదీఖానా లేకపోవడంతో శుభకార్యాలు, సమావేశాలకు ఇబ్బంది పడేవారు. వీరి ఇబ్బందులను గమనించి 2019లో నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి షాదీఖానా నిర్మాణానికి రూ.30లక్షలు విరాళం అందించి, పనులు ప్రారంభించారు.
అడ్డుకున్న వైసీపీ ప్రభుత్వం
అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం షాదీఖాన నిర్మాణ పనులను నిలిపివేసింది. దీంతో ముస్లింల కల ఆగిపోయింది. పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇక భవన నిర్మాణం కలగానే మిగిలిపోతుందా అని ముస్లింలు ఆందోళన చెందారు.
మొత్తం రూ.1.30 కోట్లు విరాళం ఇచ్చిన మంత్రి
వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడాన్ని గమనించిన మంత్రి మరో రూ.కోటి సొంత నిధులను అందించారు. దీంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రూ.కోటి కేటాయించింది. దీంతో మొత్తం రూ.2.30 కోట్ల వ్యయంతో షాదీఖానా భవన నిర్మాణం పూర్తి చేశారు.
మాట నిలబెట్టుకున్న మంత్రి
టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింల కోసం షాదీఖానా నిర్మాణాన్ని పూర్తి చేస్తానని 2024 ఎన్నికల సమయంలో మంత్రి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేయడంతో మంత్రి విరాణం రూ.1.30కోట్లు, ప్రభుత్వ నిధులు రూ.కోటి మొత్తం రూ.2.30కోట్లతో పనులు పూర్తిచేశారు. భవనం నిర్మాణ పనులు పూర్తికావడంతో త్వరలోనే షాదీఖానను ప్రారంభించి, ముస్లింలకు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షాదిఖానను పూర్తిచేసి, మాట నిలబెట్టుకున్న మత్రికి ముస్లింలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.