మెగా మొబైల్ రికవరీ మేళా
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:02 AM
జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం 5వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఐదు విడతల్లో 3,081 మొబైల్ ఫోన్లు
కర్నూలు క్రైం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో బుధవారం 5వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 5వ విడతలో 679 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు, సైబర్ ల్యాబ్ పోలీసులు రికవరీ చేశారని తెలిపారు. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం ఐదు విడతల్లో మొబైల్ రికవరీ మేళా నిర్వహించగా.. ఇందులో మొత్తం రూ.6.20 కోట్లు విలువగల 3081 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని ఆయన తెలిపారు. అనంతరం మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులను, సైబర్ ల్యాబ్ పోలీసులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, సీఐలు మధుసూదన్రావు, శివశంకర్, సైబర్ ల్యాబ్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సైబర్ లాయబ్ టెక్నికల్ టీం పోలీసులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ గోవిందుకు అభినందనలు..
మొబైల్ రికవరీ మేళాలో కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. 679 మొబైల్స్లో 95 సెల్ ఫోన్లు నాలుగో పట్టణ పోలీసులే రికవరీ చేశారు. ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ గోవిందును ఎస్పీ అభినందించారు.