Share News

స్తంభించిన వైద్యసేవలు

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:03 PM

జూడాల సమ్మెతో ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు స్తంభించాయి. జూనియర్‌ డాక్టర్ల చేస్తున్న సమ్మె ప్రభావం పేద రోగులపై తీవ్రంగా పడింది.

స్తంభించిన వైద్యసేవలు
క్యాజువాల్టీలో రోగికి సేవలు అందిస్తున్న నర్సులు

జూడాల సమ్మెతో రోగుల ఇక్కట్లు

తగ్గిన ఆపరేషన్లు, ఓపీ, ఐపీ కేసులు

ప్రైవేటుకు వెళ్తున్న కొందరు రోగులు

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జూడాల సమ్మెతో ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు స్తంభించాయి. జూనియర్‌ డాక్టర్ల చేస్తున్న సమ్మె ప్రభావం పేద రోగులపై తీవ్రంగా పడింది. ఎనిమిది రోగులుగా స్టయిఫండ్‌ను పెంచాలని కోరుతూ జూడాలు చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చింది. అత్యవసర సేవలను వారు బహిష్కరించడంతో నిరుపేద రోగులకు తిప్పలు తప్పడం లేదు. రాయలసీమ జిల్లాల ఆరోగ్య సంజీవనిగా పేరొందిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమ్మెతో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో రోగులకు ఎక్కువగా వైద్యచికిత్సలు అందించే పీజీలు, హౌస్‌ సర్జన్లు, సీనియర్‌ రెసిడెంట్లు మొత్తం 700మంది సమ్మెలోకి వెళ్లారు. కొందరు రోగులను బంధువులు ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కొందరు క్యాజువాల్టీకి వచ్చి ఇక్కడ సమ్మె ఉందని తెలుసుకుని బంధువులు క్షతగాత్రులను ప్రైవేటుకు తరలించారు. ఓ కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సు సెప్టిక్‌ సమస్యతో అడ్మిట్‌ అయిన ఆమె సాయంత్రం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిసింది.

తగ్గిన ఆపరేషన్లు, డెలివరీలు, అడ్మిషన్లు

సమ్మె ప్రభావంత్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ, ఐపీ కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఓపీకి 3347 మంది రోగులు రాగా, 207 మంది రోగులు అడ్మిషన్‌ పొందారు. ఇక కాన్పులు 12 జరగక, ఆపరేషన్లు 240 దాకా జరిగాయి. వాస్తవానికి సమ్మెకు ముందు ప్రతి రోజు ఓపీకి 3,600 మంది రోగులు, అడ్మిషన్‌ రోగులు 260 దాకా నమోదయ్యేవి. కాన్పులు 16 నుంచి 18 దాకా, మొత్తం ఆపరేషన్లు 280కి పైగా జరిగేవి. అలాగే పలు వ్యాధులకు సంబంధించిన శస్త్ర చికిత్సలు కూడా తగ్గుముఖం పట్టాయి. అత్యవసర విభాగాల్లో రోగులను చూసేవారు లేకపోవడంతో గంటల తరబడి వేచి ఉం డాల్సిన పరిస్థితి ఏర్పడింది. శస్త్ర చికిత్సలన్నింటిని వైద్యులు వాయిదా వేస్తున్నారు. అత్యవసరం అయితేనే వార్డులో చేర్చుకుంటున్నారు. ఓపీకి వచ్చే రోగులకు మందులు రాసి పంపిస్తుండటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు అవస్థలు పడుతున్నారు.

నర్సులే వైద్యులుగా...

ఆస్పత్రిలోని పలు వార్డుల్లో రోగులకు నర్సింగ్‌ సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులే చికిత్స అందిస్తూ వైద్యుల అవతారమెత్తారు. క్యాజువాల్టీతో పాటు అత్యవసర విభాగాలు, వార్డులలో వారే ఇంజెక్షన్లు వేయ డం, మందులు రాయడం, శాంపిల్స్‌ సేకరించడంు చేస్తున్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:03 PM