వైద్య సేవలు మరింత బలోపేతం
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:55 PM
రాష్ట్ర ప్రభుత్వ వైద్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభం
కర్నూలు జిల్లాకు 27 వాహనాలు
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ వైద్య సేవలకు అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మరీ ముఖ్యంగా గర్బిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అత్యవసర సమయాల్లో సకాలంలో వైద్యసేవలు అందించేందుకు 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. మంగళవారం వైద్యఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణంలో జిల్లాకు వచ్చిన 27 కొత్త 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డీఎంహెచ్వో వై.కామేశ్వర ప్రసాద్తో కలసి మంత్రి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ గర్బిణులకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రికి తరలించడం, ప్రసవానంతరం తల్లి, బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడంలో 102 సేవలు ఎంతో కీలకమన్నారు. జిల్లాకు కేటాయించిన 27 వాహనాలను అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచుతామని, ఇక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి 13 వాహనాలను ఉంచుతామన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతులు, వైద్య పరికరాలు, భవనాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ 2017లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 500 నూతన వాహనాలు అందుబాటులోకి తీసుకుని వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ ఆఫీసర్ డాక్టర్ ఎల్.భాస్కర్, డీఐవో ఉమాదేవి, ఆర్బీఎ్సకే జిల్లా కోఆర్డినేటర్ మహేశ్వర ప్రసాద్, డెమో ప్రకాష్ రాజ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ సుబ్బయ్య, జనసేన, బీజేపీ నాయకులు సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.