మల్లన్న హుండీ ఆదాయం రూ.5.61 కోట్లు
ABN , Publish Date - Feb 19 , 2026 | 11:29 PM
నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆది దంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆది దంపతులకు భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురు వారం లెక్కించారు. ఉభయ దేవాలయాలు, అన్నప్రసాద భవ నం, పరివార దేవాతాలయాల హుండీలలో 13 రోజులుగా భక్తుల నుంచి స్వామి. అమ్మవార్లకు మొక్కులు, కానుకల రూపంలో రూ.5,61,81,535 ఆదాయం వచ్చినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అలాగే 124.500 గ్రాముల బంగారం, 5 కేజీల 550 గ్రాముల వెండి వస్తువులు కానుకగా సమర్పించారని తెలిపారు. అదే విధంగా 22 యూఎస్ఏ డాలర్లు, 10 యూఏఈ దీర్హమ్స్, 4 సింగపూర్ డాలర్లు, 25 ఇంగ్లాండ్ పౌండ్స్, 1 మలేసియా రింగెట్స్, 100 ఓమాన్ బైసా, 15 ఆస్త్రేలియా డాలర్లు, 5 ఈరోస్, 1 ఖతార్ రియాల్స్, 5 సౌదీ రియాల్స్, 1 ఓమాన్ రియాల్స్, 100 థాయి లాండ్ బడ్స్ మొదలైన విదేశీ కరెన్సీని హుండీ ద్వారా స్వామి, అమ్మవార్లకు భక్తులు సమర్పించారు. చంద్రావతి కల్యాణ మండపంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన విభాగాల అధికారులు, సిబ్బంది, పర్యవేక్షకులు, శివసేవకులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.