ప్రత్యేక శిబిరాలను వినియోగించుకోండి
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:24 AM
‘సర్’ ప్రక్రియలో భాగం గా 11, 12 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన డేను నిర్వహిస్తున్నట్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
నగర పాలక కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియలో భాగం గా 11, 12 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన డేను నిర్వహిస్తున్నట్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం ఆయన పాతబస్టాండులోని చిదంబరావు వీధి, కురువ గేరి ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్ ప్రక్రియ, ప్రత్యేక శిబిరాలపై మైక్ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, ఓటర్ల సందేహలను నివృత్తి చేస్తూ ఎన్యుమరేషన ఫారాల స్వీకరణను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ బీఎల్వోలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన ఫారాలు స్వీకరణ, డిజిటలైజేషన చేపట్టనున్నారన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వచ్చి, ఓటర్ల సందేహలను నివృత్తి చేస్తూ ఫారాల సేకరణ, డిజిటలైజేషన ప్రక్రియను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సర్’పై ఓటర్లలో మరింత అవగాహన కల్పించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశామన్నారు. రాజకీయ పార్టీల బూత లెవెల్ ఏజెంట్లు సైతం బీఎల్వోలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రతి ఓటరు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఎన్నికల సంఘం నిర్దేశించిన ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అసిస్టెంట్ ఏఈఆర్వో శ్రీనివాసన, బీఎల్వోలు పాల్గొన్నారు.