లోక్ అదాలత్ను వినియోగించుకోండి
ABN , Publish Date - Jul 01 , 2026 | 11:56 PM
జిల్లాలోని కక్షిదారులందరూ జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కక్షిదారులందరూ జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి తెలిపారు. ఈ నెల 11వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగబో యే లోక్ అదాలత్ల కోసం సంబంధిత అధికారులు కృషి చేసి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కారమయ్యేందుకు తోడ్పడాలని సూచించారు. ఈ మేరకు బుధవారం స్థానిక న్యాయ సేవాసదన్ భవన్లో జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు సెకండ్ క్లాస్ మేజిస్ర్టేట్లందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కక్షిదారుల ప్రయోజనం కోసం ఈ జాతీయ లోక్అదాలత్లను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి వీలున్న క్రిమినల్ కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కారమయ్యేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కోర్టు మేజిస్ర్టేట్ అనిల్ కుమార్, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, మొబైల్ కోర్టు మేజిస్ర్టేట్ అనూష, మొదటి అదనపు కోర్టు మేజిస్ర్టేట్ అపర్ణ, కర్నూలు అడిషినల్ ఎస్పీ హుస్సేన్ పీరా, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్బాషా పాల్గొన్నారు.