భూగర్భ జలాలు పెంచుదాం: కలెక్టర్
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:41 PM
భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా అందరం కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పిలుపునిచ్చారు.
కోడుమూరు రూరల్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా అందరం కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి పిలుపునిచ్చారు. మండలంలోని అమడగుంట్ల గ్రా మంలో శనివారం జలధార-జలహారతి పనులకు కలెక్టర్ భూమి పూజ చేశారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యతలో భాగంగా పోచమ్మ కుంటలో పూడికతీత పనులు చేపట్టారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సరా సరి 6.6 మీటర్ల లోతున జలాలు ఉన్నాయని, దీన్ని 3 మీటర్లకు తీసుకరావడమే లక్ష్యమని చెప్పారు. కోడుమూరు మండలంలో 8.5 మీటర్లకు, అమడగుంట్లలో 9.5 మీటర్ల లోతులో జలాలు ఉన్నట్లు తెలిపారు. మండలంలో కనీసం 6 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగేలా నిర్ధేశించుకోవాలని సూచించారు. బిల్లులు త్వరగా అందిస్తామని, ఉపాధి పనులకు వినియోగించుకోవాలని కూలీలకు సూచించారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
నేల సంరక్షణ అందరి బాధత్య
నేల, మొక్కలను రక్షించుకోవడం అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ప్టాస్టిక్ భూతాన్ని పారద్రోలాలని సూచించారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం 6 శాతమే ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచించారు. ఆడ పిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయొద్దని, కనీసం డిగ్రీ వరకు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, డీఈ బ్రహ్మా నందరెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, డీపీవో భాస్కర్, ఏపీడీ పద్మావతి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాముడు, ఆర్ఐ అశోక్, ఏపీవో మోదీన్బాషా, ఎల్లెల్సీ డీఈ సుబ్బారాయుడు, ఏఈలు చిన్నఅలీ, దుర్గాభవానీ పాల్గొన్నారు.