కన్నుల పండువగా జ్యోతి మహోత్సవాలు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:00 AM
ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీచౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవాల వేడుకలు కన్నుల పండువగా సాగింది.
నందికోల సేవ, పదఖడ్గాలతో సంస్కృతిక కార్యక్రమాలు
కల్లూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఉగాది వేడుకల్లో భాగంగా శ్రీచౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవాల వేడుకలు కన్నుల పండువగా సాగింది. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు ఊరువాకిలి నుంచి డోలు వాయిద్యాలు, నందికోలాసేవ, అమ్మవారి పదఖడ్గాలతో గ్రామోత్సవం నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వీరశైవులు నిర్వహించిన వేడుక తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శుక్రవారం ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ వెంకటరమణ, కార్యనిర్వహణ అధికారి గుర్రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి జ్యోతులను సమర్పించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.
ఆలయంలో చేపట్టిన ఎద్దుల బండ్లు, గాడిదల ప్రదర్శన అందరినీ అలరించింది. నగరంలోని రజకులు గాడిదలను సుందరంగా అలంకరించి బండ్లుకట్టి డ్రమ్స్, మేళతాళాలతో ఊరేగిస్తూ సందడి చేశారు. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రెండో రోజు క ల్లూరు ఊరువాకిలి నుంచి గ్రామపెద్దలు, ప్ర జల సంయుక్త ఆధ్వర్యంలో ఎద్దులబండ్లు పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం చుట్టూ నారుమడి పద్దతిలో ఏర్పాటు చేసిన బురద నీటిలో ఎద్దులబండ్లు ప్రదక్షిణతో మొక్కులు తీర్చుకున్నారు. ఎద్దులబండ్లు ఊరేగింపులో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు.