జూడాల వినూత్న నిరసన
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:12 PM
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు సోమవారం కళ్లకు నలుపు వస్త్రాలతో గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
కర్నూలు హాస్పిటల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు సోమవారం కళ్లకు నలుపు వస్త్రాలతో గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ సీఎల్జీ ఎదుట ఉన్న దీక్ష శిబిరం నుంచి సూపర్ స్ఫెషాలిటీ బ్లాక్, సర్జికల్ బ్లాక్, ఎంసీహెచ్ భవనం వద్ద కు చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి ఆందోళనలు చేశారు. అనంతరం బాలాజీ క్యాంటీన్ మీదుగా క్యాజువాల్టీకి చేరుకుని పరిపాలన విభాగం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూడాల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి. నిశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న జూనియర్ డాక్టర్లు ఎక్కువ గంటలు పని చేస్తున్నప్పటికీ తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.