జేఈఈ-మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:40 PM
బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ-మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి.
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ-మెయిన్స్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జేఈఈ-మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈపరీక్షలు ఈనెల 29వ తేదీ వరకు కొనసాగుతాయి. కర్నూలు నగర శివారులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని అయాన్ డిజిటల్ కేం ద్రం, ఆదోని భీమా ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరిగాయి. ఈపరీక్షలు ఉదయం 9 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు కొనసాగాయి. పరీక్ష నిర్వాహకులు కేటాయించిన సమయం కంటే 2గంటల ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా ఎగ్జామ్ సెంటర్ల వద్ద అభ్యర్థుల సెల్ఫోన్లు, లగేజ్లు నిల్వ చేసుకునేందుకు లాకర్లు కూడా ఏర్పాటుచేశారు. గేటు బయటనే విద్యార్థులను చెక్ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. మొదటి రోజు ఆన్లైన్ పరీక్ష ప్రశాంతంగా జరగడంపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.