బియ్యం వ్యాపారుల ఇళ్లలో సోదాలు
ABN , Publish Date - Sep 10 , 2026 | 12:37 AM
అక్రమ రేషన్ బియ్యం దందా నిర్వహించే వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించినట్లు డీఎ్సఓ రాజారఘువీర్ బుధవారం తెలిపారు. రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు, దళారులు అక్రమంగా సేకరించి ఇళ్లల్లో, రహస్య గోదాముల్లో నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు
అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
పలువురిపై కేసు నమోదు
హొళగుంద, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అక్రమ రేషన్ బియ్యం దందా నిర్వహించే వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహించినట్లు డీఎ్సఓ రాజారఘువీర్ బుధవారం తెలిపారు. రేషన్ బియ్యాన్ని కొందరు వ్యాపారులు, దళారులు అక్రమంగా సేకరించి ఇళ్లల్లో, రహస్య గోదాముల్లో నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హొళగుందలో రెవెన్యూ అధికారులను ఐదు బృందాలుగా ఒకే సమయంలో ఐదు చోట్ల సోదాలు చేశారు. రెండు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బియ్యం తరలింపులో వాగ్వాదం
స్థానిక సినిమా రోడ్డులోని అబ్దుల్ రహిమాన్ అనే రైతు ఇంట్లో 77 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు గుర్తించారు. అయితే రైతు తమ పొలంలో పండించిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులో బియ్యంగా మార్చి ఇంట్లో ఉంచుకున్నానని చెప్పాడు. దీనికి అధికారులు ఒప్పుకోలేదు. శాంపిల్ బియ్యం సేకరించి వాటిని ల్యాబ్కు పంపి నివేదిక వచ్చాక వాటిని మీకు అప్పజెబుతామని అన్నారు. ఈ సందర్భంగా రైతు, వారి కుటుంబ సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ దిలీ్పకుమార్ రాకతో వివాదం సద్దుమణిగింది. వాటిని పోలీసులు, అధికారుల సమక్షంలో గోడౌన్కు తరలించి తాళం వేసి సీల్ వేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీరాజు, ఆలూరు సీఎ్సడీటీ దీపా, డీటీ నిజాముద్దీన్, వీఆర్వోలు, తలారులు పాల్గొన్నారు.
గ్యాస్ ఏజెన్సీకి భారీ జరిమానా
ఆదోనికి చెందిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి జరిమానా విధించినట్లు డీఎస్ఓ రాజా రఘువీర్ బుధవారం తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హొళగుందలోని ఇండియన్ గ్యాస్ వినియోగదారులకు సోమేశ్వర గ్యాస్ ఏజెన్సీ సక్రమంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడంలో అలసత్వం వహించడమేగాక, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి స్పందించినట్లు తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీరాజు ప్రాథమికంగా విచారణ చేసి నివేదికను జిల్లా అధికారులకు పంపించగా.. సోమేశ్వర గ్యాస్ ఏజెన్సీకి రూ.5.40 లక్షల భారీ జరిమానా విధించినట్లు తెలిపారు. సిలిండర్ పంపిణీలో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో భారీ జరిమానా విధించామన్నారు. ప్రజలకు గ్యాస్ సిలిండర్లు సక్రమంగా పంపిణీ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.