రూ.7,800 కోట్ల పెట్టుబడితో ‘అగస్త్య’
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:25 AM
అనుభవ్ అగర్వాల్ గ్రూప్లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో సుమారు రూ.7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12జీడబ్లు ఇంగాట్, వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టు స్థాపించనున్నట్లు శనివారం తెలిపారు.
3,500 మందికి ఉపాధి అవకాశాలు
కర్నూలు రాజ్విహార్ సెంటర్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): అనుభవ్ అగర్వాల్ గ్రూప్లో భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో సుమారు రూ.7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12జీడబ్లు ఇంగాట్, వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టు స్థాపించనున్నట్లు శనివారం తెలిపారు. ఈ ప్రాజెక్టు సంస్థ ప్రస్తుత సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యాలను మరింత బలాన్ని చేకూరుస్తుందని అనుభవ్ అగర్వాల్ గ్రూప్ ఛైర్మన్ అనుభవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ సౌర ఉత్పాదక రంగంలో మరింత దేశీయ ఉద్పాదనకు అవకాశం కలుగుతుందన్నారు. ఈప్రాజెక్టు స్థాపనతో 3,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫొటో వోల్టాయిక్ తయారీలో పోటీపడే ప్రాజెక్టు స్థాపించాలనే అగస్త్య ఎనర్జీ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. దేశాభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టుల స్థాపన, ఇంధన భద్రత దిశగా దేశ సాధికారితను పెంపొందించాలనే లక్ష్యంపై తాము దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అగస్త్య ఎనర్జీలో రూ.7,800 కోట్ల పెట్టుబడి, భారతదేశ ఇంధన పరివర్తనపై తమ విశ్వాసాన్ని పెంచడమే కాక, ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే తయారీ సామర్థ్యతలను పటిష్టం చేయాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్లకు ఆయన అభినందనలు తెలిపారు. అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ పీయూస్ బిచోరియా మాట్లాడుతూ ఇంగాట్, వేఫర్ తయారీ రంగంలో తమ విస్తరణ, సమీకృత సౌర ఉత్పాదక వ్యూహంలో ఒక కీలక ఉన్నత శిఖరంగా నిలుస్తుందన్నారు. సంస్థ సీఈవో బెర్నార్డ్ రాక్ మాట్లాడుతూ ప్రపంచ ఇంధన పరివర్తన, పట్టిష్టమైన, విస్తరించగల, ప్రపచంవ్యాప్తంగా పోటీపడగల సౌర ఉత్పాదక రంగాలకు బలమైన అవసరాన్ని ఈ ప్రాజెక్టు సృష్టిస్తుందన్నారు. ఈప్రాజెక్టు భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్లకు అనుగుణంగా, దేశ పునరుత్పాదక ఇంధనం, ఇంధన భద్రత, దేశీయ సౌర తయారీ పర్యావరణ వ్యవస్థ లక్ష్యాలకు మద్దతు అందిస్తుందని అన్నారు.