ఆర్యవైశ ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇల్లూరు
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:31 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కర్నూలు నగరానికి చెందిన ఇల్లూరు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
కర్నూలు కల్చరల్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కర్నూలు నగరానికి చెందిన ఇల్లూరు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. 2026-28 సంవత్సరానికి గాను ఈ పదవిని రాయలసీమ జోన్కు కేటాయించారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని ఆర్యవైశ్య మహాసభ రీజినల్ కార్యాలయమైన వాసవి ఆర్యవైశ్య హాస్టల్లో ఈ ఎన్నికల ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడు వ్యవహరించారు. నామినేషన్ల క్రమంలో కర్నూలు నుంచి ఇల్లూరు లక్ష్మయ్య, అనంతపురం నుంచి ముడియం రమణ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ముడియం రమణ నామినేషన్ బలపరచిన వ్యక్తికి మహాసభలో సభ్యత్వం లేకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు శనివారం ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో మిగిలిన అభ్యర్థి ఇల్లూరు లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని అన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాశీ అన్నపూర్ణ సత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, ముడియం రమణ, పోతుల సుశేష్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, ఇల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.