Share News

వివాహేతర సంబంధమే కారణం

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:35 AM

పట్టణంలో సంచలనం సృష్టించిన పారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. వివాహేతర సంబంధం కారణంగా హత్యాయత్నం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

 వివాహేతర సంబంధమే కారణం
నిందితులను చూపుతూ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

పారిశుధ్య కార్మికురాలిపై దాడిలో ఆరుగురి అరెస్టు

కర్నూలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య బాధితురాలు

ఆదోని, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో సంచలనం సృష్టించిన పారిశుధ్య కార్మికురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. వివాహేతర సంబంధం కారణంగా హత్యాయత్నం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదివారం ఆదోని టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ వెంకటరమణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అసలేం జరిగింది..?

కంబాలదిన్నెకు చెందిన నరసమ్మ(26)కు శీనుతో వివాహం జరిగింది. ఐదేళ్ల క్రితం భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలతో ఒంటరిగా మిగిలింది. అనంతరం మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలిగా ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో ఐసీ చిన్న ఈరన్నతో ఆమెకు పరిచయం ఏర్పడి సహజీవనం కొనసాగించింది. ఇది ఈరన్న కుటుంబంలో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ విషయంపై గతంలోనే పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది 2026 జూలై 26న చిన్న ఈరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతికి నరసమ్మ కారణమంటూ అతని భార్య శిరీష కుటుంబ సభ్యులు కక్ష పెంచుకున్నారు. ఆమెను అంతమొందించాలని పథకం వేశారు.

తెల్లవారుజామున పథకం ప్రకారం దాడి..

పథకం ప్రకారం ఈనెల 6వ తేదీన తెల్లవారుజామున ఆదోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మున్సిపల్‌ విధులు నిర్వహిస్తున్న నరసమ్మపై దాడి చేశారు. ముందుగా కళ్లలో కారం చల్లి, ఆపై వాటర్‌ బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ పోసి నిప్పటించి పరారయ్యారు. మంటల్లో చిక్కుకుని కేకలు వేసిన నరసమ్మను తోటి కార్మికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా టూటౌన్‌ పోలీసులు క్రైమ్‌ నం.170/2026 కింద కేసు నమోదు చేశారు. అమరావతి రోడ్డు, బసాపురం జంక్షన్‌ సమీపంలో పారిపోతుండగా ఆరుగురు నిందితులు శిరీష, రాములమ్మ, సుజాత, ఐసీ ఈరన్న, హేమ, అంజినమ్మను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మృతుడు చిన్న ఈరన్న కుటుంబ సభ్యులేనని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి సగం పెట్రోల్‌ ఉన్న వాటర్‌ బాటిల్‌, ప్లాస్టిక్‌ మగ్‌, కాలిన దుస్తుల అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Sep 08 , 2026 | 12:35 AM