తీరు మారకపోతే వేటు తప్పదు
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:18 PM
విధుల్లో సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు తీరు మార్చుకోక పోతే వేటు తప్పదని డీఈవో జనార్దన్రెడ్డి హెచ్చరించారు.
ఉపాధ్యాయులపై డీఈవో ఆగ్రహం
ప్యాపిలి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విధుల్లో సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులు తీరు మార్చుకోక పోతే వేటు తప్పదని డీఈవో జనార్దన్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని పీఆర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఉదయం డీఈవో సందర్శించారు. ఆ సమయానికి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఒక్కరూ కూడా హాజరుకాకపోగా 55మంది ‘పది’ విద్యార్థులకు గాను కేవలం 9 మంది మాత్రమే పాఠశాలకు వచ్చారు. దీంతో ఉపాధ్యాయుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత ఎలా సాధిస్తారంటూ ఆగ్రహించారు. మండలంలోని హుసేనాపురం, బూరుగుల, నేరేడుచెర్ల, సీతమ్మతండా ఆశ్రమ పాఠశాల, ప్యాపిలి ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ‘పది’ విద్యార్థులతో మాట్లాడారు. ఇష్టంతో చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఎంఐఎస్ కోఆర్డీనేటర్ జగన్మోహన్రెడ్డి, ఎంఈవోలు వెంకటేశ్వరనాయక్, మహేశ్వరరెడ్డి, సీఆర్పీలు రామాంజినేయులు, నవీన్ పాల్గొన్నారు.