సర్ పేరుతో మానవ హక్కుల ఉల్లంఘన
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:03 AM
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా (సర్)పేరుతో కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలపై ప్రజలు చైతన్యవంతులై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాడాలి
ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ జాబితా (సర్)పేరుతో కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలపై ప్రజలు చైతన్యవంతులై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో పౌర చైతన్య వేదిక (పీసీవీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ‘మానవ హక్కుల పరిరక్షణ, మన ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పీసీవీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది కె. ఓంకార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ పరకాల ప్రభాకర్ కీలకోపన్యాసకులుగా, సీపీడీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కుంచె శ్రీధర్, జేవీవీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి ఉపన్యాసకులుగా హాజరయ్యారు. డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ ‘సర్’ పేరుతో కేంద్రం కోట్లాదిమంది పౌరుల ఓటు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రొఫెసర్ కుంచె శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల అసలైన సమస్యల నుంచి పక్కమార్గం పట్టించడానికి కేంద్రం ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కులు, సెక్యులరిజం పరిరక్షణకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ పౌర సదస్సులో డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి, పౌర చైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఎం. తేజోవతి, సీపీడీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ఎస్ జానీబాషా తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో పీసీవీ నాయకులు న్యాయవాది రాము, చంద్రుడు, రమేష్, ఎస్ గోవింద రాజులు, హనీఫ్, జహీర్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.