గడువు లోపల ఇళ్లు నిర్మించాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:13 PM
జిల్లాలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాల పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాల పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీవోలు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉగాది నాటికి 10,178 ఇళ్లు పూర్తి చేయాలని నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా వారపు లక్ష్యాలు కూడా నిర్దేశించుకొని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) 2.0 పథకం కింద మంజూరైన 2,348 ఇళ్లలో 409 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని మిగిలిన 1,939 ఇళ్లను కూడా ఫిబ్రవరి 5 నాటికి వందశాతం గ్రౌండింగ్ చేయాలన్నారు. చెంచుకాలనీల్లో నిర్మించే పీఎం జన్మన్ కింద మంజూరైన 556 గృహాల్లో 282 ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని మిగిలిన 334 ఇళ్లను కూడా గ్రౌండింగ్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న వ్యక్తిగత మరుగుదొడ్లు, టాయిలెట్లను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.