Share News

హైకోర్టు బెంచ్‌ ప్రకటనపై న్యాయవాదుల సంబరాలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:37 AM

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను 90 రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటన చేయడంపై కర్నూలు జిల్లా లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.

  హైకోర్టు బెంచ్‌ ప్రకటనపై   న్యాయవాదుల సంబరాలు
చంద్రబాబు, లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న న్యాయవాదులు

కర్నూలు లీగల్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను 90 రోజుల్లోపు ఏర్పాటు చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటన చేయడంపై కర్నూలు జిల్లా లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. గురువారం టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్‌, దాసెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్థానిక బార్‌ అసోసియేషన్‌ వద్ద వారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా కేఈ జగదీష్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తుండటంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. దాసెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు బెంచ్‌ రాయలసీమ వాసుల చిరకాల వాంఛ అని, వారి కోరికను సీఎం చంద్రబాబు నెరవేర్చడం హర్షణీయమని కొనియాడారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు బెంచ్‌ను వీలైనంత తొందరలో ప్రారంభించి సీమ వాసులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం న్యాయవాదులు కేక్‌ను కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి రవికాంత్‌ ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యులు రవి గువేరా, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు రంగ రవికుమార్‌, శ్రీనివాసభట్టు, న్యాయవాదులు వై.శ్రీహరి, శ్రీనివాసరావు, ఏ.మాదన్న, గణేష్‌ సింగ్‌, రాజేష్‌, జహంగీర్‌ బాషా, మహిళా న్యాయవాదులు జయలక్ష్మిదేవి, కరుణ జ్యోతి, సుమన, ప్రభావతి, పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:37 AM