పత్తి కొనుగోళ్లకు మార్గదర్శకాలు
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:12 PM
రానున్న సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం మార్గదర్శకాలను (ఎస్వోపీ)ను ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తర్వులు జారీ చేసిన మార్కెటింగ్ శాఖ
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రానున్న సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం మార్గదర్శకాలను (ఎస్వోపీ)ను ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులు గురువారం జిల్లా మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి అందాయి. రాష్ట్రంలో సీసీఐ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు జరుగుతాయని, జేసీ, సీసీఐ జీఎం లేదా బీఎం, మార్కెటింగ్ శాఖ అధికారులు, సెక్రటరీలు సమన్వయంతో జిన్నింగ్ మిల్లులను, మార్కెట్ యార్డులను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించి నోటిఫై చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పత్తి రైతుల గుర్తింపును వ్యవసాయ శాఖకు చెందిన ఆదారిత ఈ-పంట నమోదు వివరాల ఆధారంగా చేపట్టనున్నారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ లేదా సీసీఐ పత్తి కొనుగోలు వ్యవస్థలో స్లాట్, సమయాన్ని ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నారాయణమూర్తి తెలిపారు. పత్తి ఎంఎ్సపీ కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. జేసీ చైర్మన్గా, ఏడీఎం కన్వీనర్గా వ్యవహరిస్తారు. వ్యవసాయ శాఖ జేడీ అదనపు పోలీసు సూపరింటెండెంట్, జిల్లా అగ్నిమాపక అధికారి, సీసీఐ ప్రతినిధులు, రవాణా శాఖ ఉప కమిషనర్, పత్తి వ్యాపార ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారనీ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
సీసీఐ ద్వారా పత్తి రైతులు..
గత సంవత్సరం సీసీఐ ద్వారా పత్తి రైతులు ప్రయోజనం పొందారు. దాదాపు రూ.500 కోట్ల దాకా సీసీఐ పత్తి రైతులకు, వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కర్నూలు జిల్లాలో రూ.2.30 లక్షల హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 10వేల హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మొదటి విడత పత్తిని పైరు నుంచి తీస్తారు. క్వింటం పత్తికి సీసీఐ రూ.8,600 చెల్లిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే క్వింటానికి అదనంగా రూ.500 రైతులకు ప్రయోజనం చేకూరనుందని ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు.